పైరసీని ఎంకరేజ్‌ చేయవద్దు    – డి. సురేశ్‌బాబు

4 Jul, 2018 00:09 IST|Sakshi

‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. తరుణ్, ఇతర నటీనటులకు థ్యాంక్స్‌. వాళ్ల కృషికి ప్రేక్షకులు మంచి ఫలితాన్ని ఇచ్చారు. సినిమా చూసిన వారందరూ మా చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తుకు తెస్తోందని, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని అంటున్నారు’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. విశ్వక్‌సేన్, సాయిసుశాంత్, వెంకట్‌ కాకుమాను, అభినవ్‌ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్‌ చౌదరి ముఖ్య తారలుగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. డి. సురేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జూన్‌ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా అనేది చాలా మంది కష్టం.

ఎంతోమంది భవిష్యత్‌ సినిమాపై ఆధారపడి ఉంటుంది. అందుకే పైరసీని ఎంకరేజ్‌ చేయవద్దు. సినిమా విడుదలైన కొన్ని రోజులకే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్, శాటిలైట్‌ ప్లాట్‌ఫామ్స్‌లోకి వస్తున్నందున పైరసీలో చూడాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాను కొందరు ‘పెళ్ళిచూపులు’తో పోల్చుకుంటున్నారు. కానీ ఇది డిఫరెంట్‌ మూవీ. రెండింటికీ పోలిక లేదు. రివ్యూస్‌ అనేవి బాధ్యతతో రాయాలి. ఎందుకంటే సినిమాను చాలా కష్టపడి తీస్తాం. రివ్యూస్‌ వల్లనే ‘పెళ్ళిచూపులు’ పెద్ద హిట్‌ అయ్యింది. ‘ఈ నగరానికి ఏమైంది?’కి కూడా మంచి రివ్యూస్‌ వచ్చాయి. ఓ రివ్యూ చదివి డిస్ట్రబ్‌ అవడం వల్లే అలా మెసేజ్‌ పెట్టాను. ఇకపై సోషల్‌ మీడియాలో ఉండకూడదని నిర్ణయించుకున్నా’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌. నటీనటులు అభినవ్‌ గోమటం, విశ్వక్‌ సేన్, సాయిసుశాంత్, సిమ్రాన్‌ చౌదరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు