చేతబడి ప్రాక్టీస్ చేసిన హీరోయిన్‌!

28 Apr, 2016 15:56 IST|Sakshi
చేతబడి ప్రాక్టీస్ చేసిన హీరోయిన్‌!

చేతబడి, క్షుద్రవిద్యలాంటి మూఢనమ్మకాలను మారుమూల గ్రామాల్లో చదువుకోని ప్రజలే కాదు.. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ సైతం నమ్ముతోందా? ఏకంగా ఇంట్లోనే చేతబడి లాంటి క్షుద్రవిద్యల్ని ఔపోసన పడుతోందా? అంటే తాజాగా అవునని అంటున్నాడు బాలీవుడ్ హీరో అధ్యాయన్ సుమన్. కంగన తన ఇంట్లోనే చేతబడిలాంటి క్షుద్రపూజలు చేసేదని అతను తాజాగా వెల్లడించాడు. క్షుద్రపూజల కోసం ఆమె తన అపార్ట్‌మెంట్‌లో ఓ గది కూడా ఉందని చెప్పాడు.    

కంగనా రనౌత్‌కు ఈ మధ్య కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే హీరో హృతిక్ రోషన్‌తో ఆమె గొడవ రోజూ మీడియాలో రచ్చ చేస్తుండగా తాజాగా ఆ మాజీ ప్రియుడు అధ్యాయన్‌ సుమన్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. 2008లో 'రాజ్‌: ద మిస్టరీ కంటిన్యూస్‌' సినిమా సందర్భంగా సుమన్‌, కంగన ఏడాది పాటు డేటింగ్ చేశారు. కంగన మాజీ లవర్‌ ఆదిత్య పంచోలీ సూచనలు పెడచెవిన పెట్టి తాను కంగనాను ప్రేమించానని, కానీ ఒక రోజు తను ఇంటికి పిలిచి క్షుద్రపూజల్లో పాల్గొనేలా చేసిందని వివరించాడు.

'ఓరోజు రాత్రి కొన్ని పూజలు చేసేందుకు కంగన తన ఇంటికి పిలిచింది. రాత్రి 11.30 గంటలకు నేను వెళ్లాను. అర్ధరాత్రి 12 గంటలకు పూజ ప్రారంభమైంది. తన అపార్ట్‌మెంట్‌లో ఆమెకు ఒక చిన్న గెస్ట్‌ రూమ్ ఉంది. ఆ గది పూర్తిగా నల్లరంగుతో ఉంటుంది. కర్టెన్లు కూడా నల్లరంగులోనే ఉంటాయి. అక్కడ కొన్ని దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. వాటిచుట్టూ మంటలు ఎగుస్తున్నాయి. పూజలో కొన్ని భయంకరమైనవి చేసింది. నేను చాలా భయపడిపోయాను. నేనేమీ చేయలేకపోయాను. వెంటనే బయటకు వచ్చి చేసిన పూజ చాలు అని చెప్పాను. దాంతో తను పల్లవితో మాట్లాడటం ప్రారంభించింది. పల్లవి ఓ రోజు రాత్రి 12 గంటలకు శ్మశానానికి వెళ్లాల్సిందిగా నన్ను కోరింది. నేను వణికిపోయాను. ఇక ఎప్పుడు అక్కడికి వెళ్లలేదు' అని సుమన్ వివరించాడు.

ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిసి ఎంతో ఆందోళన చెందారని, కుటుంబ పూజారిని పిలిచి, ఆయనకు ఈ విషయం చెప్పారని సుమన్ చెప్పుకొచ్చాడు. 'నీ  కోసం ఆమె అన్నం వండుతుందా? అని పూజారి అడిగాడు. అవును అని చెప్పాను. ఆ అన్నంలో ఆమె తన మలినమైన రక్తం కలిపి క్షుద్రపూజల కోసం వండేదని పూజారి చెప్పాడు. లండన్‌, న్యూయార్క్‌లాంటి దేశాల్లో చదివి, మెట్రోపాలిటన్ కిడ్ అయిన తాను ఇవన్ని విశ్వసించలేదు. కానీ రాశిఫలాలు చూసే ఓ మహిళ నీపై చేతబడి జరిగిందని, పహడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ చేతబడి చేస్తున్నదని తెలిపింది. వెంటనే ఆ అనుబంధం నుంచి బయటపడాలని సూచించింది. అప్పట్లో నాకు తెలిసి హిమాచల్ ప్రదేశ్‌కు తరచూ వెళ్లే వ్యక్తి నా గర్ల్‌ఫ్రెండ్ కంగనానే. అప్పటినుంచి తనతో అనుబంధం నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించాను. ఆ క్రమంలో ఎంతో మానసిక, శరీరక క్షోభ అనుభవించాను' అంటూ సమన్ డీఎన్‌ఏ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 'రాజ్‌ 2' సినిమా తర్వాత తన కెరీర్‌ పూర్తిగా పతనమవ్వగా, అదే సమయంలో కంగన సినిమాలు మాత్రం విజయవంతమయ్యాయని, వాటి గురించి మాట్లాడలంటేనే తనకు భయం అవుతున్నదని అతను చెప్పుకొచ్చాడు.