ఆయుష్మాన్‌ ఖురానా మూవీపై ట్రంప్‌ ట్వీట్‌!

22 Feb, 2020 11:25 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా తాజా చిత్రం ‘శుభ్‌మంగళ్‌ జ్యాదా సావధాన్‌’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. గే హక్కుల కార్యకర్త పీటర్‌ టాచెల్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘గ్రేట్‌’ అని పేర్కొన్నారు. విక్కీ డోనర్‌ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్‌.. అంధాదున్‌, బదాయి హో వంటి సినిమాలతో హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న ఈ హీరో.. శుక్రవారం ‘శుభ్‌మంగళ్‌ జ్యాదా సావధాన్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హితేశ్‌ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమాలో అతడు ‘గే’గా నటించాడు. ఇద్దరు అబ్బాయిలు కార్తీక్‌ సింగ్‌(ఆయుష్మాన్‌ ఖురానా), అమన్‌ త్రిపాఠి(జితేంద్ర కుమార్‌)ల ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో కామెడీతో పాటు సామాజిక సందేశాన్ని కూడా జోడించారు.

ఇక ఈ మూవీపై స్పందించిన పీటర్‌ టాచెల్‌.. ‘‘ బాలీవుడ్‌ కొత్త సినిమా. పెద్దల మనసు గెలవడానికి ఓ జంట చేసే ప్రయత్నం. స్వలింగ సంపర్కం అనేది నేరం కాదని నిరూపించేందుకు చేసే ప్రయత్నం. హుర్రే’’ అని ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ట్రంప్‌... గ్రేట్‌ అంటూ కామెంట్‌ చేశారు. కాగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో పాటు ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్‌, సలహాదారులు ఇవాంకా ట్రంప్‌, జారేద్‌ కుష్నర్‌ సహా ఇతర అధికారులు భారత పర్యటనకు రానున్నారు.

మరిన్ని వార్తలు