మీటూపై స్పందించిన నమిత

25 Nov, 2018 10:03 IST|Sakshi

మహిళల ఫిర్యాదులను ముందు వినాలని నటి, ఒకప్పటి యువత కలల రాణి నమిత అంటోంది. మీటూ సినీ పరిశ్రమలో కలకలాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కొందరిపై మీటూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకూ ప్రైమ్‌ టైమ్‌లో లేని నటి నమిత తాజాగా మళ్లీ హెడ్‌లైన్స్‌కు ఎక్కుతోంది.

తన చిరకాల ప్రేమికుడు వీరేంద్రను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టిన నమిత ఇప్పుడు నటిగా అహంభావం అనే చిత్రంతో రీ ఎం‍ట్రీ ఇస్తున్నారు. ఈ అమ్మడు మాట్లాడుతూ ఇంతకుముందులా గ్లామరస్‌ పాత్రల్లో నటించడం ఇష్టం లేదని పేర్కొంది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.

ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనేనని తాజాగా నటిస్తున్న అహంభావం చిత్రంలో పాత్రికేయురాలిగా బలమైన పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్రంపై చాలా నమ్మకం ఉందని పేర్కొంది. గ్లామర్‌గా నటించనంటున్న నమిత తన అభిమానులకు పెద్ద షాక్‌నే ఇచ్చింది. ఎందుకంటే ఆమె అందాలకు గులాం అయ్యే చాలా మంది యువత అభిమానులైపోయారన్నది వాస్తవం. మరి ఇప్పుడు వారి రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

ఇకపోతే మీటూపై స్పందించిన నమిత అందరూ మీటూ గురించి అడుగుతున్నారని, మీటూ పేరుతో మహిళలు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారని, అలా తమకు జరిగిన అక్రమాల గురించి చెప్పడానికి ధైర్యం కావాలని అంది. ముందు వారు చేసే ఫిర్యాదులను వినాలని అంది. ఆ తరువాత నిజానిజాల గురించి విచారించాలని పేర్కొంది. అయితే మీటూను తప్పుగా ఉపయోగించకూడదంది నమిత.

మరిన్ని వార్తలు