ఉత్తమ థ్రిల్లర్ ‘దృశ్యం’‌ సీక్వెల్‌కు రెడీ!

2 Jul, 2020 17:27 IST|Sakshi

తిరువనంతపురం: 2013 లో విడుదలైన మోహన్ లాల్ ‘దృశ్యం’ చిత్రం భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చేసిన ఉత్తమ థ్రిల్లర్లలో ఒకటి. ఈ సినిమా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మోహన్ లాల్ మే 21న తన  60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ఉండబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని  ప్రకటించారు. ఆగస్టు 17 నుంచి ఈ చిత్రం షూటింగ్‌కు మోహన్‌లాల్ అంగీకరించారని, దీనికి సంబంధించి ఈ వారాంతంలో పరిశ్రమలోని నిపుణులు, నిర్మాతలతో సమావేశం నిర్వహించే ఆలోచనల్లో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. (ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్‌)

ఈ సమావేశంలో కరోనా సంక్షోభ పరిస్థితిని అధిగమించడానికి తీసుకోవలసిన భద్రతా చర్యలు, ఇతర ఆర్థిక విషయాలపై  చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దృశ్యం 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించబోయే మిగిలిన తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు. గత నెలలో కేరళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన క్రమంలో సినిమా షూటింగ్‌ల కోసం అనుమతించింది.  

సునామి అనే మలయాళ చిత్రం జూన్ మధ్యలోనే కొంతమంది  సిబ్బందితో తిరిగి షూట్ ప్రారంభించింది. ఇదిలావుండగా, మోహన్ లాల్ ‘మరక్కర్: అరబికడాలింటే సింహాం’ సినిమా ఏప్రిల్‌లో తెరపైకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. దీని తరువాత జీతు జోసెఫ్‌  దర్శకత్వం  వహిస్తున్న ‘రామ్’ అనే మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రంలోని ప్రధాన భాగాలను విదేశాలలో చిత్రీకరించాల్సిన అవసరం ఉన్నందున వచ్చే ఏడాది షూటింగ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్‌)

మరిన్ని వార్తలు