క్రేజ్‌ ఉంటే చాలు.. డబ్బింగ్‌ సినిమాలతో దాడి

15 Apr, 2019 17:35 IST|Sakshi

ఒక హీరోకో, హీరోయిన్‌కో పక్క ఇండస్ట్రీలో క్రేజ్‌ ఏర్పడితే వాటిని క్యాష్‌ చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పటి సినిమాలను ప్రస్తుతమున్న క్రేజ్‌తో జతచేసి వేరే భాషల్లో రిలీజ్‌ చేస్తుంటారు. అయితే ఇది ఎవరి పని అని కచ్చితంగా చెప్పలేం. దీని వెనక సదరు నిర్మాతలే ఉండొచ్చు.. లేక హీరో, హీరోయిన్లే ఉండొచ్చు. తాజాగా అలాంటి సినిమాలే డబ్బింగ్‌ రూపంలో దాడి చేసేందుకు రెడీ అయ్యాయి.

మహానటి సినిమాతో దుల్కర్‌ సల్మాన్‌కు క్రేజ్‌ ఏర్పడగా.. అతడు గతంలో నటించిన రెండు (జనతా హోటల్‌, అతడే) సినిమాలను తెలుగులో రిలీజ్‌ చేశారు. అయితే ఆ సినిమాలు వచ్చినట్టుగా కూడా ఎవరికీ తెలీదు. ఇక ఇదే వరుసలో మోహన్‌లాల్‌ కూడా జనతాగ్యారేజ్‌తో వచ్చిన క్రేజ్‌ను వాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ని డబ్బింగ్‌ సినిమాలతో పలకరించినా.. ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోతున్నారు. తాజాగా వచ్చిన లూసిఫర్‌ కూడా అదే బాటలో నడుస్తోంది.

ఇక టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌విజయ్‌ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం లాంటి చిత్రాలతో ఇమేజ్‌ పెరగ్గా.. పక్క భాషలపై కన్నేశాడు. నోటా చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌తో మొత్తం దక్షిణాదిపై కన్నేశాడు. అయితే విజయ్‌ నటించిన ద్వారకా మూవీ ఇక్కడ తేలిపోయింది. అయితే విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను అడ్డంపెట్టుకుని ద్వారకా మూవీని తమిళంలో అర్జున్‌ రెడ్డి పేరుతో తమిళంలోకి డబ్‌ చేయనున్నారు.

ఛలో, గీతగోవిందం సినిమాలతో స్టార్‌హీరోయిన్‌గా మారింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఇక రష్మికకు ఏర్పడిన ఈ క్రేజ్‌ను వాడుకునేందుకు అక్కడి వారు కూడా రెడీ అయ్యారు. 2017లో రష్మిక నటించిన కన్నడ చిత్రం చమక్‌ను.. తెలుగులో గీతా..ఛలోగా డబ్‌ చేస్తున్నారు. ఇలా డబ్బింగ్‌ చిత్రాలతో దాడి చేస్తే.. సదరు హీరోహీరోయిన్లుకు మైనస్‌గా మారొచ్చు. అవి హిట్‌ అయితే లెక్కవేరేలా ఉంటుంది కానీ.. ప్లాఫ్‌ అయితేనే వారి కెరీర్‌గ్రాఫ్‌పై ప్రభావం చూపొచ్చు.

మరిన్ని వార్తలు