నలుగురు ముద్దుగుమ్మలతో..

24 Apr, 2018 10:49 IST|Sakshi

తమిళసినిమా: నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కోలీవుడ్‌పై మక్కువ చూపిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వారసుడు దుల్కర్‌ సల్మాన్‌ అన్న విషయం తెలిసిందే. ఈయన మాతృభాషలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా, వాయై మూడి పేసవుమ్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. బాలాజీమోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పర్వాలేదనిపించుకున్నా, ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీఛాన్స్‌ వరించింది. అలా ఒరు కాదల్‌ కణ్మణి చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు.

ఆ తరువాత మరోసారి మణిరత్నం చిత్రంలో అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేదు. ఇటీవల సోలో అనే చిత్రంలో నటించారు. మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ బహు భాషా నటుడిగా రాణిస్తున్న దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం కన్నుమ్‌ కన్నుమ్‌ కొళ్‌లైయడిత్తాల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపారు. 

కొత్త దర్శకుడు కార్తీక్‌ పరిచయం అవుతున్న ఈ చిత్రంలోనే దుల్కర్‌సల్మాన్‌తో నలుగురు కథానాయికలు రొమాన్స్‌ చేయనున్నారని సమాచారం. ఇందులో తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి ఫేమ్‌ శాలిని పాండే, నటి నివేదా పేతురాజ్‌ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో ఇద్దరి ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు మలయాళంలోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని వార్తలు