థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది

5 Mar, 2020 00:35 IST|Sakshi
రక్షణ్, దుల్కర్‌ సల్మాన్, రీతూ వర్మ, నిరంజని

– దుల్కర్‌

దుల్కర్‌ సల్మాన్, రీతూవర్మ, రక్షణ్, నిరంజని అహతియాన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. తమిళంలో ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొళ్లయడిత్తా’గా విడుదలైంది.  వయాకామ్‌ 18 స్టూడియోస్, ఆంటో జోసఫ్‌ ఫిలిమ్‌ కంపెనీ నిర్మించిన ఈ చిత్రంతో దేశింగ్‌ పెరియస్వామి దర్శకునిగా పరిచయమయ్యారు. తెలుగులో కేఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్‌ కమలాకర్‌ రెడ్డి, జనార్థన్‌ రెడ్డితో కలిసి డా. రవికిరణ్‌ విడుదల చేశారు. దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. బుధవారం ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దుల్కర్‌ మాట్లాడుతూ– ‘‘నేను నటించిన 25 సినిమా ఇది.

తమిళంలో, తెలుగులో ఒకేసారి విడుదలైంది. చూసినవాళ్లందరికీ సినిమా నచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ (డిజిటల్‌)లో చూసే సినిమా కాదిది. థియేటర్‌లో చూడాల్సిన చిత్రం. నన్ను బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. డా. రవికిరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి కంటెంట్‌ నచ్చటంతో కేఎఫ్‌సి వాళ్లతో కలిసి  తెలుగులో విడుదల చేశాను. ప్రేక్షకుల ఆదరణతో కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని నిరూపించింది’’ అన్నారు. రీతూవర్మ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మీ ముందున్నాను. ఈ సినిమాకి దర్శకుడు, కెమెరామెన్‌ రియల్‌ హీరోలు’’ అన్నారు. అనీష్‌ కురువిల్లా, రక్షణ్, నిరంజని, కె.యం భాస్కరన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు