పెద్దోళ్లు కుదరదన్నారు

29 Jan, 2019 03:33 IST|Sakshi
ఆది పినిశెట్టి, చంద్రశేఖర్, రవిచంద్ర

రవిచంద్ర, సుమయ హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ 2 మనసులు’. ఆది పినిశెట్టి దర్శకత్వంలో శేఖర్‌ మూవీస్‌ పతాకంపై చంద్రశేఖర్‌ ఎస్‌. నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చంద్రశేఖర్‌ ఎస్‌. మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రకథని చాలామంది పెద్ద హీరోల వద్దకు తీసుకెళితే ఎవ్వరూ డేట్స్‌ ఇవ్వలేదు. బ్యానర్‌ ఏంటి? సినిమా వస్తుందా? లేదా? అని అడిగేవారు. దీంతో అందరూ కొత్తవాళ్లనే తీసుకున్నాం.

ఎప్పటికైనా మాది చాలా పెద్ద బ్యానర్‌ అవుతుందని ఆశిస్తున్నా. ఇందులోని నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్లు అయినా సినిమా చాలా బాగా వస్తోంది. ఇప్పటి వరకూ 70 శాతం షూటింగ్‌ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఇదొక ప్రేమకథ. నా తమ్ముడు సత్య ఈ చిత్రం స్క్రిప్ట్‌ విషయంలో నాకు చాలా సపోర్ట్‌ చేశాడు. మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఈ మధ్య వచ్చిన ప్రేమ కథలకి చాలా భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అని రవిచంద్ర అన్నారు. రంగి, మహేశ్, కాదంబరి కిరణ్, తిరుపతి, జావెద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందన్‌కృష్ణ, సంగీతం: జి.వి.ఎం.గౌతమ్‌.

మరిన్ని వార్తలు