సాక్షి, అమరావతి: టీవీలో ప్రసారం కానున్న ‘యాత్ర’ చిత్రాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. టీవీలో ప్రసారం కానున్న యాత్ర సినిమా ఏరకంగానూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో టీవీలో ఈ చిత్ర ప్రసారానికి అడ్డంకులు తొలగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే యాత్ర శాటిలైట్ రైట్స్ను సొంతం చేసుకున్న స్టార్ మా చానల్.. ఈ చిత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యకం చేసింది.
యాత్ర చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయకుండా చూడాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. టీడీపీకి సమాధానంగా మరో లేఖ రాసింది. యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ ఆ లేఖలో తెలిపింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. దీంతో రేపు మధ్యాహ్నం యాత్ర చిత్రం స్టార్ మాలో ప్రసారం కానుంది.
#Yatra World Television Premiere..This Sunday at 12 PM on @StarMaa#YatraOnMaa pic.twitter.com/wOLIyda7Vx
— STAR MAA (@StarMaa) April 4, 2019