పేరు.. డబ్బులు రావాలి – వినాయక్‌

30 Jan, 2018 00:48 IST|Sakshi
వీవీ వినాయక్, కోటి, మాలతి

‘‘ఎందుకో ఏమో’ టైటిల్‌లాగే టీజర్‌ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న సినిమా ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్‌ను వినాయక్‌ విడుదల చేశారు.

కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. మా నిర్మాత రాజీ పడకుండా, నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగా. సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో, అదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి లవ్‌ స్టోరీతో పాటు కమర్షియల్‌ హంగులు మా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు మాలతి. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, కెమెరా: జీయస్‌ రాజ్‌ (మురళి).
 

మరిన్ని వార్తలు