ఆ అనుభవాలను డైరీలో భద్రంగా దాచుకుంటా

28 Sep, 2015 16:23 IST|Sakshi
ఆ అనుభవాలను డైరీలో భద్రంగా దాచుకుంటా

చెన్నై:  ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న 'చీకటి రాజ్యం' సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న తెలుగు నటి మధుశాలిని  ఆనందంలో మునిగి తేలుతోంది. కమల్ హాసన్ అంతటి గొప్పనటుడితో  కలిసి నటించడం తనకు చెప్పలేనంత  సంతోషంగా ఉందంటూ  మురిసిపోతోంది.  ఆయనతో కలిసి నటించడం...తన నటనకు మరింత  పరిణతి  వచ్చిందని చెబుతోంది.  తనలోని నటనా కౌశల్యాన్ని బయటకు  తేవడానికి ఇదో మంచి అవకాశమని మధుశాలిని తెలిపింది.  

మొదటిరోజు షూటింగ్లో పాల్గొన్న తాను టెన్షన్తో ఉన్న విషయాన్ని కమల్ గమనించి,  తనకు  చాలా ధైర్యం చెప్పారని మధుశాలిని తెలిపింది.  మొదటి రోజు షూటింగ్  అనుభవాన్ని తన  డైరీలో రాసుకుంటానంటోంది.   ఆ అనుభవాలను చాలా భద్రంగా దాచుకుంటానని, కమల్తో కలిసి పనిచేస్తున్న ప్రతిరోజూ కొత్తగా ఉంటోందనీ, ... చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది.  తమిళంలో 'అవన్ ఇవన్' సినిమా తరువాత, తనకు కమల్ సార్  చిత్రంలో  మంచి అవకాశం లభించిందని ఆమె గుర్తు  చేసుకుంది.

బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసి  సుదీర్ఘ అనుభవం సాధించినా కమల్ హాసన్లో కొంచెం కూడా గర్వం కనిపించలేదని మధుశాలిని పేర్కొంది. ఇప్పటికీ సెట్లో శ్రద్ధగా కూర్చుని, అనుకున్న ఔట్పుట్ వచ్చేదాకా ఆయన కష్టపడతారని చెప్పింది. బాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ అమితాబ్తో ....రాంగోపాల్ వర్మ  'డిపార్ట్మెంట్'లో నటించినా, కేవలం  సెట్లో మాత్రమే  బిగ్ బీ నటన చూసి మురిసిపోవడం తప్ప, తమ మధ్య పెద్దగా సీన్లు లేవని తెలిపింది.  అయితే చీకటిరాజ్యం  సినిమాలో కమల్ సార్తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉందని మురిసిపోతోంది.

కాగా తెలుగు, తమిళ భాషల్లో   కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా చీకటి రాజ్యం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో   రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో  ప్రకాష్ రాజ్,  త్రిష, సంపత్ రాజ్  నటిస్తున్నారు.  'స్లీప్లెస్ నైట్' అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..