సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

18 Aug, 2019 19:50 IST|Sakshi

సినీ నిర్మాణంలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కీలక పాత్ర వహిస్తారు. అలాంటి తెలుగు సినీ ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ (టిసిపిఈయూ) స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుకను సెప్టెంబర్‌ 8న గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్‌, ప్రొడ్యూసర్స్‌ కెఎస్‌ రామారావు, దిల్‌ రాజు దర్శక మండలి అధ్యక్షుడు ఎన్‌ శంకర్‌, మా అధ్యక్షుడు నరేష్‌ వికె, జీవిత రాజశేఖర్‌, ట్రెజరర్‌ రాజీవ్‌ కనకాల తదితరులు పాల్గొని సెప్టెంబర్‌ 8 జరిగే తెలుగు సినీ రథసారధుల రజతోత్సవ సభ విజయవంతం కావడానికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిసిపిఇయు అధ్యక్షుడు అమ్మిరాజు, జెనరల్‌ సెక్రటరీ ఆర్‌ వెంకటేశ్వర్‌ రావు, కోశాదికారి సతీష్‌, ఆడిటర్‌ వివేక్‌ పాల్గొని సెప్టెంబర్‌ 8న జరిగే వేడుకను దిగ్విజయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘ఈరోజున దాసరి గారు ఉంటే ఈ కార్యక్రమం మరో రేంజ్‌లో ఉండేది. ఆయనకు అన్ని విభాగాల పట్ల ఉన్న ప్రేమ అలాంటిది. ఒకసినిమా స్టార్ట్‌ అవడానికి ముందే ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ వర్క్‌స్టార్ట్‌ అవుతుంది. అలాంటి ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ యూనియన్‌కి నిర్మాతల మండలి తరపున కావాల్సిన సహాకారం తప్పకుండా అందిస్తాం’ అన్నారు. 

ప్రముఖ నిర్మాత కెఎస్‌ రామారావు మాట్లాడుతూ  ‘ఒక మూవీ స్టార్ట్‌ అయ్యి రిలీజ్‌ అయ్యేవరకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పాత్ర చాలా ముఖ్యం. ఒక సినిమాకు నిర్మాతలుగా మా పేరు పడినా వారిదే ఎక్కువ కష్టం ఉంటుంది. అలాంటి ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వెల్‌ ఫేర్‌ కోసం జరుపుతున్న ఈ కార్యక్రమానికి మా వంతు సహాకారం అందిస్తాం’అన్నారు. 

ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ ‘సినిమా మొదలయ్యి ప్యాకప్‌ అయ్యే వరకూ తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌కీ రోల్‌ పోషిస్తారు. లొకేషన్‌లో ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. అలాంటి సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక గ్రాండ్‌ సక్సస్‌ కావడానికి యావత్‌ సినీ పరిశ్రమ మొత్తం అండగా ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమాన్ని జెమిని టీవీ, శ్రేయాస్‌ మీడియా అద్వర్యంలో నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ సెలెబ్రిటీస్‌ హాజరవుతారు. దీని ద్వారా వచ్చే ఫండ్‌ను టిసిపిఇయు సభ్యుల వెల్‌ ఫేర్‌ కోసం ఉపయోగిస్తారు..

మరిన్ని వార్తలు