వివేకంతో అభిమానులు ఖుషీ

25 Aug, 2017 01:16 IST|Sakshi
వివేకంతో అభిమానులు ఖుషీ

తమిళసినిమా: అజిత్‌ అభిమానులు ఎంతగానో ఎదరుచూసిన వివేకం చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఇది అజిత్‌ 57వ చిత్రం మాత్రమే కాదు, ఆయనకు నటుడిగా 25వ వసంతంలోకి అడుగుపెట్టిన చిత్రం కూడా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. కాజల్‌అగర్వాల్‌ కథానాయకిగా నటుడు కమలహాసన్‌ రెండవ కూతురు అక్షరహాసన్‌ కీలక పాత్రలోనూ నటించిన ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబరాయ్‌ ప్రతినాయకుడిగా నటించారు.

శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలింస్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. అనిరుధ్‌ సంగీత బాణీలు లందించారు.అజిత్‌ ఇంటర్‌పోల్‌ అధికారిగా నటించిన ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో రూపొందింది. చిత్ర ఆధ్యంతం ఉత్కంఠభరితంగా శరవేగంగా సాగుతుంది. మన దేశాన్ని అను ఆయుధాల ద్వారా భూకంపాలు వచ్చేలా చీకటి అరాచక శక్తుల కుట్రను కథానాయకుడు అజిత్‌ ఎలా ఛేదించారన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం వివేకం. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు అజిత్‌ సహా చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. చిత్రం హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

కమలహాసన్‌ అభినందనలు
నటుడు కమలహాసన్‌ తన కూతురు అక్షరహాసన్‌తో కలిసి గురువారం వివేకం చిత్రాన్ని చూశారు. చిత్రం ప్రదర్శన సమయంలోనే ఆయన తాను తన కూతురు అక్షరతో కలిసి వివేకం చిత్రం చూస్తున్నాను. చిత్రం గురించి మంచి రిపోర్ట్‌ వస్తోంది. అజిత్‌ సహా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు.

అభిమానుల హంగామా
ఇక అజిత్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వివేకం చిత్రాన్ని గురువారం వేకువజాము నుంచే చాలా థియేటర్లలో ప్రదర్శించారు. అభిమానులు అజిత్‌ ఫొటోలతో కూడిన భారీ కటౌట్‌లను థియేటర్ల ముందు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కటౌట్‌లకు పాలాభిషేకాలు, ఆలయాల్లో పూజలు అంటూ హంగామా సృష్టించారు.