చోరీకి గురైన షారూఖ్‌ ఫ్యాన్స్‌

3 Nov, 2017 12:53 IST|Sakshi

సాక్షి, సినిమా : నవంబర్ 2 వచ్చిందంటే చాలూ.. ముంబై బాంద్రాలోని మన్నత్‌ వద్ద ప్రజలు భారీగా కనిపిస్తుంటారు. బాలీవుడ్ బాద్‌షా, కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌ విల్లా అది. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు జబ్ర ఫ్యాన్స్‌(వీరాభిమానులు) దేశం నలుమూలల నుంచి వచ్చి అర్ధరాత్రి అక్కడ బారులు తీరుతుంటారు. ఇక తనను చూసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారికి తనదైన ఫోజులతో బదులివ్వటం ఈ సీనియర్ హీరోకు అలవాటే. 

ఈ ఏడాది 52వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం కూడా అలాంటి పరిస్థితులే అక్కడ కనిపించాయి. కానీ, ఈసారి అభిమానులు నిరాశగా అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి. అందుకు కారణం వారి సెల్‌ ఫోన్లు చోరీకి గురికావటమే. తమ ఫోన్లు, పర్సులు పోయాయంటూ దాదాపు 30 మంది బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారంట. అయితే అంత మంది గుంపులో దొంగలను పట్టుకోవటం చాలా కష్టమేనని పోలీసులు తేల్చేయటంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. 

షరా మాములే...  

షారూఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఇంటి వద్ద ప్రతీ ఏడూ భద్రతను కట్టుదిట్టం చేస్తుంటారు. అయితే షారూఖ్‌ పైన నిల్చున్న సమయంలో ఆయన్ని దగ్గరి నుంచి చూసేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడుతుంటారు. ఆ సమయంలో తొక్కిసలాట, లాఠీఛార్జ్‌ సర్వసాధారణంగా మారిపోయాయంట. ఆ అలజడినే అదనుగా చేసుకుని కొందరు దొంగతనాలు చేస్తుంటారంట. ఈ నేపథ్యంలో నిన్న కూడా కొందరు తమ చేతి వాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సంగతి పెద్దగా పట్టించుకోని షారూఖ్ ఎప్పటిలాగే అలీబాగ్ బంగ్లాలో స్నేహితుల మధ్య పుట్టినరోజు పార్టీ చేసుకున్నారు. షారూఖ్‌ అత్యంత సన్నిహితుడు కరణ్‌ జోహర్‌, దీపికా పదుకునే, అలియా భట్‌, సిదార్థ్‌ మల‍్హోత్రా, ఫరా ఖాన్‌ కుందర్‌, శ్వేతా బచ్చన్‌, ఇంకా షారూఖ్‌ కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు