నా గుండె పగిలింది

24 Dec, 2018 03:40 IST|Sakshi
ఫాతిమా సనా షేక్‌

హిందీ చిత్రం ‘దంగల్‌’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాలీవుడ్‌ నటి ఫాతిమా సనా షేక్‌. అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ ఖాన్‌లతో కలసి ఆమె నటించిన తాజా చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఈ విషయం గురించి ఫాతిమా మాట్లాడుతూ– ‘‘సినిమా రిలీజైనప్పుడు నెగటివ్‌ రివ్యూలను చూశాను. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ప్రేక్షకులకు సినిమా నచ్చలేదని తెలిసింది. నా గుండె పగిలింది. బాగా డిస్ట్రబ్‌ అయ్యాను. ఈ సినిమా కోసం మేమంతా రెండేళ్లు కష్టపడ్డాం.

కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పదు. సినిమా ఆడకపోయినా ఆమిర్, అమితాబ్, కత్రినా వంటి సీనియర్స్‌తో నటించే అవకాశం నాకు దక్కడం హ్యాపీ. ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చాను నేను. ఒక ఫెయిల్యూర్‌ నన్ను ఇండస్ట్రీకి దూరం చేయలేదు. ప్రతి వైఫల్యం నుంచి కొత్త పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అనురాగ్‌ బసు దర్శకత్వంలో నా నెక్ట్స్‌ చిత్రం ఉంటుంది. అందులో రాజ్‌కుమార్‌ రావ్‌ హీరో. ఇది ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’ సినిమాకు సీక్వెల్‌ కాదు’’ అని చెప్పుకొచ్చారామె.

మరిన్ని వార్తలు