ఐదోసారి!

19 May, 2016 01:22 IST|Sakshi
ఐదోసారి!

అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ జంటగా విపుల్ అమృత్‌లాల్ షా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నమస్తే లండన్’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై ఘన విజయం సాధించింది. మరోసారి అక్షయ్‌కుమార్, విపుల్ షా కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘నమస్తే ఇంగ్లాండ్’ పేరు ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా విపుల్ షా స్వీయ దర్శకత్వంలో నిర్మించనుండటం విశేషం.
 
 ‘నమస్తే లండన్’ చిత్రానికి ఇది సీక్వెల్ ఎంత మాత్రం కాదని చిత్ర బృందం స్పష్టం చేసింది. అక్షయ్‌కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఇప్పటికే ‘రౌడీ రాథోడ్’, ‘జోకర్’, ‘వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబయ్ దుబారా’, ‘హాలిడే’ చిత్రాల్లో అక్షయ్, సోనాక్షి జతకట్టారు. ఈ చిత్రాల ద్వారా హిట్ పెయిర్ అనిపించుకున్నారు కూడా. ఇప్పుడు ఐదో సారి జతకట్టారు. ముందు నాలుగు చిత్రాల్లోనూ ఇద్దరి మధ్యా మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఈసారి ఏ రేంజ్‌లో మేజిక్ చేస్తారో చూడాలి.