సీరియస్‌గా తీసుకోవాలి!

10 Jul, 2014 00:10 IST|Sakshi
సీరియస్‌గా తీసుకోవాలి!

‘‘మన దేశంలో ఆడవాళ్లపై ఎక్కువ శాతం అత్యాచారాలు ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. తండ్రి, సోదరుల నుంచి కూడా ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి విషయాలు చాలావరకు వెలుగులోకి రావడంలేదు. ఇంట్లో చెత్తని కార్పెట్ కింద తోసేసి మన భారతదేశ సంస్కృతి గొప్పది అని చెప్పుకుంటే ఏం ఉపయోగం? అనేది నా అభిప్రాయం. అందుకే సమాజం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశాల నేపథ్యంలో ఈ సినిమా తీశాం. ఈ సీరియస్ ఎలిమెంట్‌ని మేం వినోద ప్రధానంగా చూపించాం. కథానుసారం’’ అని పి. సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు.
 
మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, ప్రియాంకా పల్లవి, దివ్య ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. ఈ నెల 15న ఈ చిత్రం పాటలను, 18న చిత్రాన్ని విడుదల చేయనున్నామని, తల్లిదండ్రులందరూ చూడాల్సిన చిత్రం ఇదని నిర్మాత తెలిపారు. మా సంస్థలో వచ్చిన గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోదని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. మంచి పాటలు కుదిరాయని ప్రవీణ్ ఇమ్మడి తెలిపారు. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, ప్రియాంక తదితరులు ఈ చిత్రంలో మంచి సందేశం ఉందని అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: కుర్రా విజయ్‌కుమార్.