ఇళయరాజా సోదరుడికి పార్టీ పదవి

26 Nov, 2015 14:43 IST|Sakshi
ఇళయరాజా సోదరుడికి పార్టీ పదవి

తమిళనాడులో ఇటీవలి కాలంలో బీజేపీలో చేరిన పలువురు సినీ ప్రముఖులకు పార్టీ పదవులు ఇచ్చారు. వాళ్లలో ఇళయరాజా సోదరుడు, ప్రముఖ సంగీతకారుడు గంగై అమరన్‌ను కళల విభాగానికి ప్యాట్రన్‌గా నియమిచంగా, కేంద్ర మాజీ మంత్రి డి. నెపోలియన్‌కు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకాల విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ తెలిపారు.

దర్శకుడు కస్తూరి రాజాకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక సభ్యత్వంతో పాటు  కళల విభాగానికి ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. ఆ విభాగానికి కార్యదర్శిగా నటి గాయత్రీ రఘురామ్ నియమితులయ్యారు. పార్టీ ప్రచార విభాగం ఉపాధ్యక్షురాలిగా నటి, నిర్మాత కుట్టి పద్మినిని నియమించారు. ఎన్నికల విభాగానికి అధ్యక్షుడిగా అన్నాడీఎంకే మాజీ ఎంపీ ఎస్.మలైసామిని నియమించారు. గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రిపదవి నిర్వహించిన నెపోలియన్.. 2014 డిసెంబర్‌లో డీఎంకేను వీడి బీజేపీలో చేరారు. గంగై అమరన్ కూడా గత సంవత్సరమే పార్టీలో చేరారు.