టాప్‌ కమెడియన్‌పై ఎఫ్‌ఐఆర్‌

14 Dec, 2016 16:00 IST|Sakshi
టాప్‌ కమెడియన్‌పై ఎఫ్‌ఐఆర్‌

ముంబయి: ప్రముఖ టాప్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పర్యావరణ భద్రతా చట్టం, ఎంఆర్‌టీపీ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. అక్రమ నిర్మాణాల కేసులో ఇరుక్కున్న ఆయన ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన బంగ్లాలో కార్యాలయం నిర్మించుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు లంచం అడిగారని, అచ్చేదిన్‌ (మంచిరోజులు) అంటే ఇవేనా అంటూ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ట్వీట్‌ చేయడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ విచారణకు ఆదేశించారు.

 ఈ అక్రమ నిర్మాణం వ్యవహారంలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. కపిల్‌ శర్మ నివాసముంటున్న బిల్డింగ్‌ పూర్తిగా అక్రమమైనదని  దాని ఇరుగుపొరుగువారు ఆరోపించారు. అంధేరిలోని ఫోర్‌ బంగ్లాస్‌ ఏరియాలో ఉన్న కపిల్‌ శర్మ బంగ్లాను పూర్తిగా చట్టవిరుద్ధంగా కట్టారని వారు చెప్తున్నారు. అయతే, బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు మాత్రం కపిల్‌ శర్మ తన బంగ్లాలో పలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు పత్రాలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కాగా, కపిల్‌ బంగ్లా విషయంలో తాము కోర్టు ఆశ్రయించాలని భావిస్తున్నట్టు స్థానిక కోఆపరేటివ్‌ సోసైటీ చైర్మన్‌ అనురాగ్‌ పఠాక్‌ మీడియాకు తెలిపారు.