దక్షిణాదిలో తొలిసారిగా జాంబీ మూవీ!

5 Jan, 2016 12:54 IST|Sakshi
దక్షిణాదిలో తొలిసారిగా జాంబీ మూవీ!

ఇండియన్ స్క్రీన్ మీద డ్రాక్యులా, ప్రిడేటర్, జాంబీ తరహా సినిమాలు చాలా అరుదు, అలాంటి అరుదైన జానర్‌లో త్వరలో ఓ సినిమా రాబోతోంది. అది కూడా మన సౌత్ ఇండస్ట్రీలో కావటం మరో విశేషం. ఇటీవల తనీఒరువన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయం రవి మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఒక వైరస్ కారణంగా మృగాలుగా మారిన మనుషులను ఓ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడనే కథతో రూపొందిన మిరుదన్ సినిమాతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్నాడు. సాధారణంగా ఇలా జాంబీ జానర్‌లో తెరకెక్కిన సినిమాలు మన ఇండస్ట్రీలలో కనిపించవు. అయితే ఇటీవల కాలంలో మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అంతర్జాతీయస్థాయి సినిమాలు ప్రాంతీయభాషల్లో కూడా వస్తున్నాయి.

జయం రవి, లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో శక్తి సౌందర్ రాజన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ హీరోగా తెరకెక్కిన ఐయామ్ లెజెండ్ తరహాలో కనిపిస్తున్న ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.