నయనతార లక్కే లక్కు. ఈమె వ్యక్తిగత జీవితంలో ఆటుపోటులెన్నో. నట జీవితంలో ఆమెకు ఎదురులేదని చెప్పవచ్చు. తొలి ఇన్నింగ్, రెండవ ఇన్నింగ్ అనే తేడా లేకుండా దూసుకుపోతోంది. అవకాశాల తలుపు తట్టి మరీ వరిస్తున్నాయి. నయనతార ఊ అంటే ఆమె ముందు వాలి కథలు వినిపించడానికి చాలా మంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు.
పెద్ద నిర్మాతలు నయనతారకే తొలి ప్రాధాన్యం అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ నయనతార కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సంస్థ జయం రవి హీరోగా ఆయన సోదరుడు జయం రాజా దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో జయం రవి సరసన నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అన్నీ కుదిరితే జయం రవి, నయనతార నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. అదే విధంగా జయం రాజా, జయం రవి కాంబినేషన్కు ఒక ప్రత్యేకత ఉంది. వీరు కలిసి చేసిన జయం, ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మీ సంతోష్ సుబ్రమణియం తదితర చిత్రాలన్నీ విజయాలు సాధించాయి. తాజా చిత్రమూ పక్కా కమర్షియల్ కథాంశంతో రూపొందనున్నట్లు తెలిసింది. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ఇంతకు ముందు జయం రవి, జయం రాజా కాంబినేషన్లో సంతోష్ సుబ్రమణియన్ చిత్రాన్ని నిర్మించింది.
తాజా చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. నయనతార ప్రస్తుతం అజిత్ సరసన ఒక చిత్రం, ఆర్యతో జంటగా రాజురాణి, కహానీ రీమేక్లో నటిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో జయం రవితో నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.