మొదటి మూడు రోజులు రివ్యూలు నిషేధించాలి

23 Jul, 2018 11:55 IST|Sakshi

సినిమాలో ఎమోషన్స్‌ చూడకుండా రొమాన్స్‌పై విమర్శలా?

ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ భూపతి

ఘనంగా విజయోత్సవం

ఆర్‌ఎక్స్‌ 100 సినిమా విజయోత్సవం నగరంలోని వుడా చిల్డ్రన్‌ ఎరినాలో ఆదివారం రాత్రి ఉత్సాహంగా సాగింది. హీరో హీరోయిన్లు కార్తీకేయరెడ్డి, పాయల్‌ రాజ్‌పుత్‌ డ్యాన్స్‌లు చేస్తూ, ఫొటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేశారు.

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినిమా సమీక్ష రాసే వారికి తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్స్‌ కనిపించటం లేదు.. కేవలం 6 నిమిషలా రొమాన్స్‌ మాత్రమే కనిపిస్తోందంటే వాళ్ల్ల ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్థం అవుతోందని ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర  దర్శకుడు అజయ్‌ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మైండ్‌లో అలాంటివి లేవు కాబట్టి 140 నిమిషాల ఎమోషన్స్‌కు కనెక్ట్‌ అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం వుడా చిల్డ్రన్‌ ఏరినాలో గౌరీ బాయి అసోసియేట్స్, మూన్‌ పవర్‌ ఈవెంట్స్‌ సంయుక్తంగా  ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ అజయ్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలకు యూ ట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌  వస్తున్నాయన్నారు.

సినిమాలో రొమాన్స్‌ ఎందుకు అనేది సినిమా పూర్తిగా చూస్తే అర్థం అవుతుందని అలా కాకుండా నచ్చినట్లు రివ్యూలు రాసి సినిమా పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలను బ్యాన్‌ చేయాలని మంత్రి గంటాను కోరారు. మెగాస్టార్‌ చిరంజీవికి మా సినిమా క్యూబ్‌ను పంపించామని ఈ రోజు మా చిత్రాన్ని ఆయన చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు.  మంత్రి గంటా మాట్లాడుతూ రివ్యూలను బ్యాన్‌ చేయాలనే ఆలోచన మంచిదని ముఖ్యమంత్రి తో చర్చించి దాన్ని అమలు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వంద శాతం సినిమా షూటింగ్‌ చేసే చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రం నిర్మాత అశోక్‌ రెడ్డి, కో–ప్రొడ్యూసర్లు సురేష్‌ రెడ్డి, రవి కుమార్‌రెడ్డి, వెంకటరెడ్డి మ్యూజిక్‌ డెరెక్టర్‌ చైతన్య భరధ్వజ్, కెమెరామెన్‌ రామిరెడ్డి, గౌరీబాయి అసోసియేట్స్‌ అధినేత శివకుమార్, మూన్‌ పవర్‌ ఈవెంట్స్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రామ్‌చరణ్‌ నుంచి సునీల్‌ వరకు అందరూ మెచ్చుకున్నారు
ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం చూసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నుంచి హీరో సునీల్‌ వరకు అందరూ సినిమా బాగుందని మెచ్చుకున్నారని హీరో కార్తీకేయ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమలో ఎవరిని ఎదగనివ్వరనే ఒక అపోహ ఉంది. కానీ అది నిజం కాదు మాకు ఎవరు అండ లేరు.. మా కథలో దమ్ము ఉంది. మేము కష్టపడి చేశాం మా చిత్రాన్ని చూసి పంపిణీదారులు ముందుకు వచ్చి విడుదల చేశారు. ఇప్పుడు ప్రేక్షకులను అదరిస్తున్నారు.  ఇకనైనా రివ్యూలు రాసేవారు కచ్చితంగా రాయాలని లేకుంటే మనివేయటమే మంచిందన్నారు. వైజాగ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడ తన సినిమా విజయోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు.


 ఆర్‌ఎక్స్‌ 100 విజయోత్సవ వేదికపై మాట్లాడుతున్న మంత్రి గంటా

తెలుగు సినిమాలే చేయాలని ఉంది
ఇప్పటికే పంజాబీ, హిందీ సినిమాలు చేస్తున్నా అక్కడ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తున్నారని అందుకే తెలుగు సినిమాలే చేయాలని తనకు ఉందని హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. మొదటిసారి కథ విన్నప్పుడు ఈ రోల్‌ నేను చేయగలనా అనిపించింది. ఈ చిత్రంలో తన రోల్‌ ఛాలెజింగ్‌ ఉందన్నారు.

జిగేలు రాణి పాటకుహీరో హీరోయిన్ల స్టెప్పులు
విజయోత్సవంలో మునిగి తేలుతున్న ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తీక్, హీరోయిన్‌ రాజ్‌పుత్‌ రంగస్థలంలోని జిగేలు రాణి పాటకు స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి వేదికను హోరెత్తించారు. 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు