ఫస్ట్ టైమ్... తెరపైనా తండ్రీ కూతుళ్ళు!

4 Jan, 2016 23:25 IST|Sakshi
ఫస్ట్ టైమ్... తెరపైనా తండ్రీ కూతుళ్ళు!

మన సినిమాల్లో వారసులకు భలే క్రేజు. అందులోనూ సూపర్‌స్టార్ తండ్రి, స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న వారసులైతే వేరే చెప్పనక్కరలేదు. వారిద్దరూ కలసి ఒకే సినిమాలో నటిస్తే, ఇక డబుల్ క్రేజ్ ఖాయం. ఇప్పుడు కమలహాసన్ కుటుంబం నుంచి అలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ రానున్నట్లు భోగట్టా. కమలహాసన్ కుమార్తె శ్రుతీహాసన్ సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి తండ్రితో కలసి ఆమె ఎప్పుడు నటిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
 
  కాగా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. రాబోయే ఒక చిత్రంలో తండ్రీ కూతుళ్ళిద్దరూ కలసి నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే - ఆ సినిమాలోనూ వాళ్ళు తండ్రీ కూతుళ్ళుగానే కనిపించనున్నారు. జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు టి.కె. రాజీవ్ కుమార్ ఈ తండ్రీ కూతుళ్ళిద్దరూ నటించే స్క్రిప్ట్ ఆలోచించారు. ఆ ఆలోచన నచ్చి కమల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని చెన్నై కోడంబాకమ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి, రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఫ్యామిలీ సెంటిమెంట్స్ నిండిన ఒక రొమాంటిక్ కామెడీ సినిమాను కమలహాసన్ ఇప్పటికే చేస్తున్నారు.
 
  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘అమ్మా నాన్న ఆట’ అనే పేరు కూడా పెట్టారు. జరీనా వహాబ్, అమల అక్కినేని కూడా ఆ సినిమాలో ఉన్నారు. మరి... ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా అదే సినిమాలో నాన్నతో కలసి నటిస్తున్నారా? లేక అది పూర్తిగా కొత్త స్క్రిప్టు, సినిమానా అన్న వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. సినిమా ఏదైనా, ఇప్పటికైతే కమల్, శ్రుతీహాసన్‌లు కలసి నటించడం వరకు కన్‌ఫర్మ్. మిగతా వివరాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.