ఒకరు కాదు... అయిదుగురు

11 Nov, 2016 23:04 IST|Sakshi
ఒకరు కాదు... అయిదుగురు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి హీరోలు వెనకాడడం లేదు. కానీ, ఇద్దరు మహా అయితే ముగ్గురు హీరోలు కలసి నటిస్తుంటారు. తాజాగా ఐదుగురు హీరోలతో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. తొలి చిత్రం ‘భలే మంచి రోజు’తో హిట్ అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథ కూడా రెడీ అయిందట.

ఇప్పటికే నారా రోహిత్, సందీప్ కిషన్, నాగశౌర్యలకు కథ వినిపించగా వారు ఓకే అన్నారనీ, మిగిలిన ఇద్దరు హీరోలను ఎంపిక చేసే పనిలో దర్శకుడున్నారని తెలుస్తోంది. ఐదుగురిలో ఒక పెద్ద వయస్సు ఉన్న హీరో కథకి అవసరమట. సో, ఆ హీరోని ఫైనలైజ్ చేసే పని మీద ఉన్నారట. ఇప్పుడొస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు భోగట్టా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.