ఐదుగురు హీరోలతో ఓ సినిమా!

10 Oct, 2014 11:42 IST|Sakshi
ఐదుగురు హీరోలతో ఓ సినిమా!

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తేనే మల్టీ స్టారర్ అంటాం. అదికూడా ఒక సీనియర్ హీరో, ఒక కుర్రహీరో కలిసి చేయడం ఇన్నాళ్లూ జరుగుతోంది. కానీ ఒకేసారి ఐదుగురు కుర్ర హీరోలు కలిసి ఓ సినిమా చేయడం సాధ్యమేనా? తమకు సాధ్యమంటున్నారు కోలీవుడ్ హీరోలు. అది కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు!!  విశాల్, ఆర్య, కార్తీ, జీవా, జయం రవి.. వీళ్లు ఐదుగురూ కలిసి ఓ తమిళ సినిమాను ఉచితంగా చేస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన లాభాలను దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం (సిఫా).. అదే, నడిగర సంఘం భవన నిర్మాణానికి ఉపయోగిస్తారు. తామంతా కలిసి ఈ సినిమా చేస్తున్నట్లు విశాల్ మీడియాకు తెలిపాడు.

వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే నడిగర సంఘానికి కొత్త భవనం కట్టించాలనుకున్నా, మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో అది ఆగిపోయింది. సంఘం ప్రాంగణాన్నిఓ మల్టీప్లెక్సుకు అద్దెకు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు రావడమే ఇందుకు కారణం. అయితే, నడిగర సంఘానికి శాశ్వత భవనం ఉండాలనే తామంతా భావించామని, ఇటీవలే సర్వసభ్య సమావేశంలో ఈ ఆలోచన గురించి చర్చించామని విశాల్ చెప్పాడు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. విశాల్ ప్రస్తుతం సుందర్ దర్శకత్వంలో వస్తున్న 'అంబాలా'లో నటిస్తున్నాడు. దీపావళికి అతడు నటించిన 'పూజ' చిత్రం విడుదల కానుంది.