‘అజ్ఞాతవాసి’ ప్రదర్శన నిలిపేస్తారా..!

13 Jan, 2018 15:49 IST|Sakshi

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే సినిమాకు నెగెటివ్ టాక్ రావటంతో పాటు కాపీ అన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్‌ దర్శకుడు జెరోమ్‌ సల్లే స్వయంగా ఈ సినిమా ప్లాట్ తన సినిమా ఫ్లాట్కు దగ్గరగా ఉందని కామెంట్ చేశారు. అంతేకాదు అజ్ఞాతవాసి నిర్మాతలు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలపై కూడా సల్లే స్పందించారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదు అంటూ తాను చర్యలకు రెడీ అవుతున్నట్టుగా హింట్‌ ఇచ్చారు.

అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా సల్లే ప్రకటించలేదు. ఒకవేళ కాపీ రైట్‌ ఉల్లంఘన కింద జెరోమ్‌ సల్లే చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి అన్న విషయాలపై ఫోర్బ్స్ తాజా కథనంలో వివరించింది. చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటే సల్లే ముఖ్యంగా అజ్ఞాతవాసి సినిమా డిస్ట్రిబ్యూషన్, ప్రదర్శనలను నిలిపివేయాల్సిందిగా కోరే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ అదే జరిగితే దర్శకుడి కెరీర్‌పై ఆ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఫోర్బ్స్‌ అభిప్రాయపడింది. గతంలో ఇలాంటి సంఘటనల కారణంగా చాలా మంది చిత్ర ప్రముఖులు తమ విశ్వాసాన్ని, కీర్తిని కోల్పోయారని తెలిపింది. అంతేకాదు ఇది త్రివిక్రమ్‌ కెరీర్‌ను కష్టాల్లో పడేసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు