నలుగురు బ్యూటీస్‌తో అధర్వ

2 Sep, 2016 02:59 IST|Sakshi
నలుగురు బ్యూటీస్‌తో అధర్వ

యువ నటుడు అధర్వ నలుగురు భామలతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. కనిదన్ చిత్రం తరువాత నటుడు అధర్వ నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుమ్ సురుళిరాజనుమ్. ఇందులో ఆయన సరసన రెజీనా, ప్రణీత, ఐశ్వర్య రాజేశ్, ఆనంది నాయికలుగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సూరి, నాన్‌కడవుల్ రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత టీ.శివ అమ్మా క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది.
 
  కాగా ఓడమ్ ఇళవరసు కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది రొమాంటిక్ లవ్, కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. అమ్మాయిల తొలి ప్రేమ వారి జీవితాల్లో ఎంత ప్రభావం చూపుతుందో అన్నది చాలా అందంగా చెప్పనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను మధురైలో పూర్తి చేసినట్లు చెప్పారు. రెండో షెడ్యూల్‌ను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.
 
 చిత్రాన్ని డిసెంబర్‌లో తెరపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత టీ.శివ తెలిపారు. ఆయన ఈ చిత్రాన్ని 2ఎంబీ సంస్థ అధినేతలు రఘునందన్, పీఎస్‌ఆర్.చంద్రశేఖర్, ఆర్.శరవణన్‌లతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేతలు ఐబీ.కార్తీకేయదిలీపన్  సంగోటయ్య, డీ.పరంజ్యోతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.