చెట్టు, చేప, ప్రకృతి.. ఇంట్రస్టింగ్‌ ఫ్రైడే

15 Feb, 2018 14:20 IST|Sakshi
అ!, మనసుకు నచ్చింది మూవీ పోస్టర్స్‌

ఈ శుక్రవారం టాలీవుడ్ లో ఆసక్తికరమైన సినిమాలు బరిలో దిగుతున్నాయి. కొత్త తరహా కథా కథనాలతో రూపొందిన అ! సినిమాతో తొలిసారిగా నాని నిర్మాతగా మారుతుంటే.. మనసుకు నచ్చింది సినిమాతో సూపర్‌ స్టార్‌ కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా మారుతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనం చూపిస్తున్నారు.

ఈ రెండు సినిమాలకు మరో ప్రత్యేక కథ కూడా ఉంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాల్లో ముగ్గురు టాప్ హీరోలు కేవలం వినిపించేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా చెట్టు, చేప, ప్రకృతి లాంటి వాటికి టాప్‌ స్టార్లు గాత్రదానం చేయటం విశేషం. అ! సినిమాలో చేప పాత్రకు నాని, చెట్టు పాత్రకు రవితేజ డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మనసుకు నచ్చింది సినిమా కొత్త టీజర్‌ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సూపర్‌ స్టార్ అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రకృతికి వాయిస్ అందించారు. ఇలా ఒకే రోజు రిలీజ్ అవుతున్న రెండు సినిమాల్లో ముగ్గురు టాప్‌ హీరోలు చెట్టు, చేప, ప్రకృతి లాంటి వాటికి డబ్బింగ్‌ చెప్పటం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు