కిస్సింగ్‌ సీన్లపై కస్సుమన్న హీరో

16 May, 2019 14:38 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ షాహిద్‌ కపూర్‌ జర్నలిస్ట్‌పై మండిపడ్డాడు. లిప్‌ లాక్‌లపై ప్రశ్నించిన విలేకరిని తిట్టిపోశాడు. ‘అర్జున్‌ రెడ్డి’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘కబీర్‌ సింగ్‌’  సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. సినిమాలో ఎన్ని ముద్దు సన్నివేశాలు ఉన్నాయని హీరోయిన్‌ కియారా అద్వానీని ఈ సందర్భంగా రిపోర్టర్‌ ఒకరు ప్రశ్నించగా.. లెక్కపెట్టుకోలేదని ఆమె సమాధానం ఇచ్చారు. కియారా జవాబుతో సంతృప్తి చెందని సదరు జర్నలిస్ట్‌ పదేపదే ఇదే ప్రశ్న సంధించాడు. దీంతో సహనం కోల్పోయిన షాహిద్‌ కపూర్‌ అతడిపై మండిపడ్డాడు. ‘చూస్తుంటే నీకు గాల్‌ఫ్రెండ్‌ లేనట్టుంది. మా సినిమాలో లిప్‌లాక్‌ సీన్‌ చూడాలనుకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే. అయితే ఈ సీన్‌ ఒక్కదాని కోసమే డబ్బు చెల్లించాలని నేను చెప్పడం​ లేదు. ముద్దు సన్నివేశాల కోసం మాత్రమే ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నార’ని షాహిద్‌ క్లాస్‌ పీకాడు.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన కబీర్‌ సింగ్‌ సినిమా జూన్‌ 21న విడుదల కానుంది. ప్రేమలో విఫలమైన వైద్యుడి పాత్రలో షాహిద్‌ కపూర్‌ కనిపించనున్నాడు. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో విజయ్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు.

మరిన్ని వార్తలు