'గాలిపటం నాలో నటిని వెలికితీసింది'

31 Dec, 1998 00:00 IST|Sakshi
'గాలిపటం నాలో నటిని వెలికితీసింది'

గాలిపటం చిత్రంలో తాను గ్లామరస్గా కనిపించినా, నటించడానికి తనకు చాలా అవకాశం లభించిందని ఆ సినిమా హీరోయిన్ క్రిస్టీనా అఖీవా చెప్పింది. ఇంతకుముందు యమ్లా పగ్లా దీవానా -2 చిత్రంలో నటించిన ఆమె.. త్వరలో విడుదల కాబోతున్న రొమాంటిక్ డ్రామా చిత్రం 'గాలిపటం'లో హీరోయిన్గా చేసింది. సినిమా కథ తనకు చాలా నచ్చిందని, ఇందులో తాను విదేశాల నుంచి వచ్చిన తెలుగమ్మాయిగా చేస్తున్నానని ఆమె తెలిపింది. ఈ సినిమా ప్రధానంగా భావోద్వేగాల గురించి, నటన గురించే ఉంటుందని క్రిస్టీనా అంటోంది. ఇంతకుముందు తెలుగులో అసలు ఇలాంటి కథలు రాలేదని, ఈ కథ చాలా పురోగామిగా ఉంటుందని చెప్పింది. సర్వసాధారణ లవ్స్టోరీలు, ఇప్పటికే కొన్ని వందల సార్లు వచ్చేసిన కథలా ఇది ఏమాత్రం ఉండబోదని, సరికొత్తగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ సినిమాలో తనను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నరాలు తెగేంత ఉత్కంఠగా ఉందని క్రిస్టీనా అంటోంది. తెలుగులో తనను కూడా ఆదరిస్తారనే భావిస్తోంది. తనతో కలిసి పనిచేసినవాళ్లంతా తనను ఎంతో ఆదరించారని, బయటి అమ్మాయిలా ఏమాత్రం చూడకుండా సొంత మనిషిలాగే భావించారని చెప్పింది. తాను ఈ భాషను, డైలాగులను అర్థం చేసుకోడానికి తనకు చాలా సమయం ఇచ్చారని, దాంతో ఎంతో ఆనందించానని తెలిపింది. అయితే, మన ప్రవర్తనను బట్టే అవతలివాళ్లు మన పట్ల ఎలా ప్రవర్తిస్తారన్నది కూడా ఉంటుందని అనుభవపూర్వకంగా చెప్పింది. సెట్ మీదకు వచ్చినప్పుడు పని గురించే ఆలోచిస్తానని, అందరితో చాలా సంతోషంగా కలిసిపోతానని తెలిపింది. అందుకే అంతా తనకు బాగా సాయం చేశారంది. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన 'గాలిపటం' చిత్రంలో ఆది సరసన క్రిస్టీనా, ఎరికా ఫెర్నాండెజ్ నటించారు.