అశోక్‌ తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే

11 Nov, 2019 02:44 IST|Sakshi
సినిమా ప్రారంభోత్సవ వేడుకలో నరేశ్, నిధీ అగర్వాల్, రానా, రామ్‌చరణ్, శ్రీరామ్‌ ఆదిత్య. గల్లా అశోక్, ఆది శేషగిరిరావు, కృష్ణ, గల్లా జయ్‌దేవ్, కేశినేని నాని, గల్లా అరుణ కుమారి

‘‘గల్లా జయదేవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను సోదరుడిలా భావిస్తారు. ఆయన నిర్మాతగా కొడుకు అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. పద్మావతిగారికి, అశోక్‌కి, నిధీ అగర్వాల్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని హీరో రామ్‌చరణ్‌ అన్నారు. వ్యాపారవేత్త, పార్లమెంట్‌ సభ్యుడు గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయవుతున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అమర్‌రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్‌ కథానాయిక.

ముహూర్తపు సన్నివేశానికి నటుడు రానా కెమెరా స్విచ్చాన్‌ చేయగా, రామ్‌చరణ్‌ క్లాప్‌ ఇచ్చారు. సూపర్‌స్టార్‌ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మంచి కథ, కథనాలతో అశోక్‌ హీరోగా పరిచయం కాబోతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు రానా. గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ–‘‘టెక్సాస్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌లో అశోక్‌ డిగ్రీ పూర్తి చేశాడు. మా మామ కృష్ణగారి సినిమాల్లో అశోక్‌ చిన్నప్పుడు నటించాడు. తన తొలి దర్శక–నిర్మాత కృష్ణగారే. మహేశ్‌బాబు ‘నాని’ సినిమాలోనూ అశోక్‌ నటించాడు.

మా బ్యానర్‌లో కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్‌ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘హీరో కావాలని అశోక్‌ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు’’ అన్నారు పద్మావతి. ‘‘ఈ కథకు అశోక్‌ కరెక్ట్‌గా సరిపోతాడు’’ అని శ్రీరామ్‌ ఆదిత్య అన్నారు. ‘‘నేటి నుంచి  చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’అన్నారు గల్లా అశోక్‌. ఈ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి,  నటులు వీకే నరేష్, సుధీర్‌బాబు, సుశాంత్, నిధీ అగర్వాల్, పార్లమెంట్‌ సభ్యులు రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని, రచయిత సత్యానంద్, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, నన్నపనేని రాజకుమారి, డా.రమాదేవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు