1 కాదు... 3 నక్షత్రాలు

3 Nov, 2017 00:14 IST|Sakshi

‘వన్, టు, త్రీ... రేస్‌ స్టార్ట్‌ అవ్వకముందు ఇలానే చెబుతారు. ఇప్పుడు చెబుతున్నది రేస్‌ గురించి కాదు.. గౌతమ్‌ మీనన్‌ తీస్తున్న ‘ధృవనక్షత్రం’ గురించి. ‘ఘర్షణ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఏమాయ చేసావే, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి హిట్‌ చిత్రాలు తీసిన గౌతమ్‌ ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా తీస్తున్న సినిమా ఇది. విశేషం ఏంటంటే... ఈ సినిమాను ఒకటి కాదు... మూడు భాగాలుగా తీయాలని ఫిక్సయ్యారు. కథ అంత పెద్దది. అందుకేగా ‘బాహుబలి’ని కూడా రెండు భాగాలుగా తీశారు.

ఒకే సినిమాలో కథ మొత్తం చెప్పలేకపోతే... ఇలా పార్టులు ప్లాన్‌ చేస్తారు. ప్రస్తుతం ‘ధృవనక్షత్రం’ ఫస్ట్‌ పార్ట్‌ రూపొందుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మొదటి భాగాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. సెకండ్, థర్డ్‌ పార్ట్‌లకు పెద్ద గ్యాప్‌ తీసుకోకుండానే తెరపైకి తెస్తారట.  కథ విషయానికి వస్తే.. పదిమంది కలిసి మేము సైతం అంటూ  ఒక టీమ్‌గా స్టార్ట్‌ అయ్యి  దేశాన్ని ఓ పెద్ద  ప్రమాదం నుంచి ఎలా కాపాడారు? అనే కథాంశంతో రూపొందుతోందని సమాచారం. సో.. దేశభక్తి సినిమా కావచ్చు.

>
మరిన్ని వార్తలు