బాహుబలి-2 తర్వాత గోల్‌మాల్‌ అగెయిన్‌

13 Nov, 2017 20:24 IST|Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌కు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. ఈ యేడాది రెండు వందల కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రంగా గోల్‌మాల్‌ అగెయిన్‌ నిలిచింది. ఆదివారం వసూళ్లతో ఈ మార్క్‌ చేరుకుందని సినీ ట్రేడ్‌ విశ్లేషకుడు తరన్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలియజేశారు.

తద్వారా వరుణ్‌ ధావన్‌ నటించిన జుద్వా-2 చిత్రాన్ని వెనక్కి నెట్టి గోల్‌మాల్‌ అగెయిన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 500 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి ది కంక్లూజన్‌ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. డబ్బింగ్ చిత్రంగా విడుదలైన బాహుబలి-2 ఎవరూ ఊహించని రేంజ్‌లో ప్రభంజనం సృష్టించగా... తర్వాత వచ్చిన సల్మాన్‌ ట్యూబ్‌లైట్‌, షారూఖ్‌ జబ్ హ్యారీ మెట్‌ సెజల్‌, అక్షయ్‌ కుమార్‌ టాయ్‌ లెట్‌ చిత్రాలు మ్యాజిక్‌ చేస్తాయని భావించినప్పటికీ అది జరగలేదు. దీంతో ఈ యేడాది కనీసం రెండు వందల కోట్ల క్లబ్‌లో కూడా ఏ చిత్రం చేరదేమోనని అంతా భావించారు.

అయితే దీపావళికి రిలీజ్ అయిన గోల్‌మాల్‌ అగెయిన్‌కు అమీర్‌ ఖాన్‌ సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా 3500 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం.. విదేశాల్లో 732 స్క్రీన్లలో రిలీజ్ అయి 46 కోట్లు రాబట్టింది. అజయ్‌ దేవగన్‌, టబు, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భారీ యాక్షన్‌ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి 200 కోట్లు రాబట్టి ఈ యేడాది ఇప్పటిదాకా హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు సంజయ్‌ లీలా భన్సాలీ పద్మావతి చిత్రంపైనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు