అక్షయ్‌ కుమార్‌ వరుసగా నాలుగోసారి

31 Dec, 2019 11:34 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజాగా నటించిన చిత్రం ‘గుడ్‌ న్యూస్‌’. ఇందులో అక్షయ్‌కు జోడీగా కరీనా కపూర్‌ నటించారు. కృత్రిమ గర్బధారణ సమయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటల మధ్య ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే కథ. ఇదొక సున్నిత అంశమైనప్పటికీ దర్శకుడు రాజ్‌ మెహతా దాన్ని ఎక్కడా అపహాస్యం చేయకుండా జాగ్రత్తపడుతూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ చిత్రం స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌ 3’కు గట్టి పోటీనిస్తోంది.

కాగా కేసరి, మిషన్‌ మంగళ్‌, హౌస్‌ ఫుల్‌ 4 చిత్రాల సక్సెస్‌తో జోష్‌ మీదున్న అక్షయ్‌ కుమార్‌ గుడ్‌ న్యూస్‌తో ఈయేడు నాలుగోసారి పలకరించారు. దేశంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ‘గుడ్‌ న్యూస్‌’ బాక్సాఫీస్‌ దగ్గర పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ రూ. 100 కోట్ల మార్క్‌ను చేరడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా తొలినాడే రూ.17 కోట్ల పైచిలుకు వసూలు చేయగా, నాలుగు రోజుల్లో రూ.88 కోట్లను రాబట్టింది. నేడు రానున్న కలెక్షన్లతో కలిపి ఈ సినిమా కొత్త సంవత్సరానికల్లా సెంచరీ దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో అక్షయ్‌ కుమార్‌ వరుస సెంచరీలతో ఈ ఏడాదికి ‘గుడ్‌’బై చెప్పనున్నారు.

మరిన్ని వార్తలు