‘సీటీమార్‌’ అంటున్న గోపీచంద్‌

27 Jan, 2020 09:19 IST|Sakshi

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుటున్న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ముందుగా సోషల్‌మీడియాలో లీకువీరులు చెప్పినట్టుగానే ఈ సినిమాకు ‘సీటీమార్‌’అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంతో కోచ్‌ అవతారం ఎత్తనున్న గోపిచంద్‌ అందుకు తగ్గట్టు మారారు. నెత్తిన టోపీ ధరించి, విజిల్‌ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా పోస్ట్‌ర్‌లో గోపిచంద్‌ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.  

తన 28వ సినిమాలో గోపీచంద్‌ ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా మిల్క్‌బ్యూటీ తమన్నా తెలంగాణ జట్టు కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక వరుస ఫెయిల్యూర్‌తో సతమతమవుతున్న గోపిచంద్‌ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ‘గౌతమ్‌నంద’తో తనకు ఫెయిల్యూర్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సంపత్‌ నందిపై మరోసారి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకున్నాడు. దీంతో సంపత్‌ నంది గోపిచంద్‌కు హిట్టు అందిస్తాడో లేదో చూడాలి. భూమిక, రావురమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు