రజినీకాంత్‌కు విలన్‌గా గోపిచంద్‌!

6 Mar, 2020 16:17 IST|Sakshi

దర్బార్‌ సినిమా అనంతరం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న సినిమా ‘అన్నాత్తే’. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సినిమాలోని మరో కీలక పాత్ర కోసం (విలన్‌ రోల్‌) టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌ను సంప్రదించినట్లు సమాచారం. గోపిచంద్‌ హీరోగా నటించిన శౌర్యం సినిమాతో శివ దర్శకుడిగా పరిచయమై విషయం తెలిసిందే.

తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేక పోయినా.. ప్రస్తుతం తమిళంలో స్టార్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో శౌర్యం, శంఖం సినిమాలు తెరకెక్కాయి. ఆ పరిచయంతోనే గోపిచంద్‌ను శివ  సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఇందుకు గోపిచంద్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం విడుదల కావాల్సి ఉంది. ఇక విలన్‌గా కెరీర్‌ ప్రారంభించిన గోపించంద్‌ ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో సీటీమార్‌ అనే మూవీలో నటిస్తున్నాడు. అనంతరం తేజతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

మరిన్ని వార్తలు