తెలుగు సినిమాని కొత్త దారిలో తీసుకెళుతుంది

14 Aug, 2018 00:44 IST|Sakshi
శ్రీనాథ్, శ్రీనివాస్, గోరేటి వెంకన్న, అశోక్‌ తేజ

గోరేటి వెంకన్న

ఎం.ఎస్‌.క్రియేషన్స్‌ పతాకంపై మహంకాళి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’. మాగంటి శ్రీనాథ్, మేఘన జంటగా నటించారు. నాగసాయి మాకం దర్శకుడు. ఈ చిత్రం కోసం గోరేటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగసాయి మాట్లాడుతూ – ‘‘దాదాపు 200 పోలీస్‌ స్టేషన్లలకు వెళ్లి అక్కడి కేసులను పరిశీలించి కథను తయారు చేసుకున్నాను. సినిమాకి పనికొచ్చే కేసులను కథలో చేర్చాం. ఈ కేసులన్నీ వినోదాత్మకంగానే ఉంటాయి. సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది’’ అన్నారు. మహంకాళీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ‘‘నేనీ చిత్రాన్ని ప్యాషన్‌ కోసం చేయలేదు. వ్యాపారం కోసమే చేశాను.

పెట్టిన డబ్బు తిరిగి రాకపోతే ప్యాషన్‌ ఉండి ఏం లాభం. ఈ సినిమాను కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కించాం’’ అన్నారు. సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ – ‘‘సాహిత్యానికి చిన్నా పెద్దా తేడా లేదని దాసరిగారు నాతో చెప్పేవారు. చిన్న హీరోకు పాట రాసినా సూపర్‌ స్టార్‌కు రాసినట్లే భావించి రాయాలని చెప్పేవారు. అలాగే ఈ చిత్రంలో మంచి పాట రాశాను. మనసు పెట్టి రచించాను’’ అన్నారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ – ‘‘నాకు గాయకునిగా, గీత రచయితగానే కాకుండా నటునిగా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు దర్శక,నిర్మాతలు. ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. కావాల్సినంత వినోదం ఉంటుంది. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ ’  తెలుగు సినిమాను కొత్తదారిలో తీసుకెళ్లే చిత్రమవుతుంది’ అన్నారు.

మరిన్ని వార్తలు