గుణశేఖర్‌ ‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్‌ అప్‌డేట్‌

23 Jun, 2020 14:53 IST|Sakshi

కమర్షియల్‌, పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు గుణశేఖర్‌. భారీ సెట్లు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ డైరెక్టర్‌ ప్రస్తుతం ‘హిరణ్యకశ్యప’ టైటిల్‌తో పౌరాణిక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోందని గుణశేఖర్‌ స్వయంగా ప్రకటించారు. తాజాగా ‘హిర్యణ్యకశ్యప’ ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాన్‌ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని కూడా తెలిపింది. (ఆగస్టులోనే రానా పెళ్లి)

సురేశ్‌‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ‘హిరణ్యకశ్యప’ చిత్రంలో రానా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అనుష్క ‘రుద్రమదేవి’ చిత్రం తర్వాత  కాస్త గ్యాప్‌ ఇచ్చిన డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఆ తర్వాత ‘బాహుబలి’ని మించిన రేంజ్‌లో ఓ చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం అటకెక్కిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి అయ్యాయని ప్రకటించడంతో ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న అసత్య వార్తలకు చిత్ర బృందం పుల్‌స్టాప్‌ పెట్టింది. ఇక ఇది భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ ఈ సినిమాను హిరణ్యకశ్యపుడి కోణంలో గుణశేఖర్‌ తెరకెక్కించబోతున్నారు. 

మరిన్ని వార్తలు