'అల్లు అర్జున్ ను అవమానించారు'

16 Nov, 2017 13:10 IST|Sakshi

నంది అవార్డులపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ ప్రముకులు, అభిమానులు అవార్డుల ఎంపిక న్యాయంగా జరగలేదని విమర్శిస్తుండగా, దర్శకుడు గుణశేఖర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రుద్రమదేవి సినిమాకు ఆశించిన స్థాయిలో అవార్డులు రాకపోవటంపై ఇప్పటికే స్పందించిన గుణశేఖర్, తాజాగా అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వటం పై మాట్లాడారు.

కావాలనే అల్లు అర్జున్ ను అవమానించారన్న గుణశేఖర్, స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వటం తప్పన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు, ఆమెను కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందని తెలిపారు.  ఈ విషయంపై స్పదించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగిందన్నారు. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారు..? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు