జీవీతో ఐశ్వర్య

20 Jan, 2019 10:25 IST|Sakshi

మణిరత్నం చిత్రంలో యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌తో కలిసి నటించడానికి ఐశ్వర్యరాజేశ్‌ సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌. ఈయన చేతిలో ఇప్పుడు 10 చిత్రాల వరకూ ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది 7 చిత్రాలు తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. ఆ మధ్య నటుడిగా కాస్త తడబడ్డా, నాచియార్‌తో హిట్‌ట్రాక్‌లో పడ్డ జీవీ తాజాగా దర్శకుడు మణిరత్నం నిర్మించనున్న చిత్రంలో హీరోగా నటించడానికి పచ్చజెండా ఊపారు.

మణిరత్నం శిష్యుడు ధనశేఖరన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇకపోతే ఇందులో నటి ఐశ్వర్యరాజేశ్‌ ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో తను జీవీ ప్రకాశ్‌కుమార్‌కు అక్కగా కనిపించబోతోందని సమాచారం. ఇంతకు ముందే కాక్కాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి ప్రశంసలు అందుకున్న ఈమె ఇటీవల హీరోయిన్‌గా బాగా బిజీ అయిపోయింది. అంతే కాదు కనా చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో చాలా ఉత్సాహంలో ఉన్న ఐశ్వర్యరాజేశ్‌కు మరోసారి మణిరత్నం సొంత బ్యానర్‌ మద్రాస్‌ టాకీస్‌ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించే అవకాశం రావడంతో మరింత సంబరపడిపోతోంది.

ఈమె ఇంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో సెక్క సెవంద వానం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జత కట్టే హీరోయిన్‌ ఎంపిక జరుగుతోందట. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి 96 చిత్రం ఫేమ్‌ గోవింద్‌వసంత్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం జయంరవి, విక్రమ్, శింబు, అమితాబచ్చన్, ఐశ్వర్యరాయ్‌ వంటి భారీ తారాగణంతో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు