‘హైదర్’ బాగా భయపెట్టాడు

9 Jul, 2014 23:14 IST|Sakshi

 షాహిద్, విశాల్ భరద్వాజ్ మరోసారి జోడీ కట్టారు. గతంలో విశాల్ తీసిన కమీనేలో షాహిద్ హీరోగా నటించడం తెలిసిందే. ప్రఖ్యాత రచయిత షేక్‌స్పియర్ రాసిన హామ్లెట్ ఆధారంగా ఇతడు రూపొందించిన హైదర్‌లోనూ మనోడే హీరో. ఇందులో నటించేటప్పుడు ఎంతో భయంగా, కంగారుగా అనిపించిందని షాహిద్ చెప్పాడు. షేక్‌స్పియర్ మూడు విషాదాంతాలు మాక్‌బెత్ (మక్బూల్), ఒథెల్లో (ఓంకార), హామ్లెట్ (హైదర్)ను విశాల్ సినిమాలుగా మలిచాడు. ‘నా కెరీర్‌లో అన్నింటికంటే గొప్పపాత్ర కమీనే సినిమాలోనిది. మళ్లీ విశాల్‌తో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. హామ్లెట్ వంటి కథలతో తీసే సినిమాల్లో నటించే అవకాశం అతికొద్ది మందికే వస్తుంది.
 
 ఇలాంటి పాత్ర చేస్తున్నప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇంకా సాధించాల్సింది చాలా ఉందనిపిస్తుంది. షూటింగ్ సమయంలో భయం వేసినప్పుడల్లా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్లి ధైర్యం తెచ్చుకునేవాడిని. ‘బాగా చేశానా ?’ అంటూ విశాల్‌తోపాటు ఇతరులనూ అడిగేవాణ్ని’ ఈ సినిమా ట్రయలర్ విడుదల సందర్భంగా మీడియాకు షాహిద్ వివరించాడు. హైదర్ అక్టోబర్ రెండున థియేటర్లకు వస్తున్నాడు. తరువాత విశాల్ మాట్లాడుతూ ఎన్నాళ్లుగానో అనుకుంటున్న ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుందని అనుకోలేదని చెప్పాడు.
 
 హామ్లెట్‌కు క థ నేపథ్యంగా బాగా నప్పుతుందని చిత్రీకరణకు కాశ్మీర్‌ను ఎంచుకున్నామని, ఇది కుటుంబ కథాచిత్రమని తెలిపాడు. కమీనే వంటి యాక్షన్ సినిమాలు తీసిన విశాల్.. మక్డీ, ది బ్లూ అంబ్రెల్లా వంటి చక్కని బాలల చిత్రాలూ రూపొందించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ‘నాకు అన్ని రకాల కథలూ ఇష్టమే. మానవ సంఘర్షణపై ఎక్కువ ఆసక్తి’ అని విశాల్ వివరించాడు. టబూ, కేకే మీనన్, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.