వైవిధ్య కథా చిత్రాలను ఎంచుకుని నటిస్తున్న నటుడు ఆది. కోలీవుడ్లో ఈరమ్, అరవాన్, యూటర్న్ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆది తాజాగా నటిస్తున్న చిత్రం పార్టనర్. ఇక నటి హన్సిక విషయానికి వస్తే ‘మహా’ చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రా ల నాయకి స్థాయికి ఎదిగింది. ఈ బ్యూటీ ఇప్పుడు తొలిసారిగా ఆదితో కలిసి నటిస్తోంది. అయితే ఇందులో వీరిద్దరూ జంటగా నటించడం లేదట. పార్టనర్ చిత్రంలో ఆదికి జంటగా పాలక్ లల్వాణి అనే నటి నటించనుంది. ఈ అమ్మడు కుప్పత్తురాజా చిత్రంలో జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా నటించింది.
ఆర్ఎఫ్సీ క్రియేషన్స్ పతాకంపై ఎస్పీ.కాళీ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మనోజ్ దామోదరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్టనర్ చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిగా వినోదభరితంగా సాగే కథా చిత్రం. అదే సమయంలో సైన్స్ ఫిక్షన్తో కూడిన ఫాంటసీ పార్టు కూడా చిత్రంలో ఉంటుంది. ఇక హన్సిక పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాక నటుడు ఆది సినీ కెరీర్లోనే ముఖ్యమైన చిత్రంగా పార్టనర్ నిలుస్తుంద’ని తెలిపారు.