ఆ హీరోలతో నటించాలని ఉంది

4 Oct, 2018 00:50 IST|Sakshi

‘‘అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల చేత మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది’’ అన్నారు కథానాయిక హర్షిత. రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో సంజోష్, హర్షిత జంటగా తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్‌’. సీనియర్‌ నటులు రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర చేశారు. పొన్నాల చందు, ఎం.ఎస్‌. మూర్తి, అరవింద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హర్షిత మాట్లాడుతూ– ‘‘మాది రాజస్తాన్‌. తెలుగులో ఇది నాకు నాలుగో సినిమా.

ఇంతకుముందు ‘కన్నయ్య, ఖయ్యూం భాయ్, సత్యగ్యాంగ్‌’ సినిమాల్లో నటించాను. ‘బేవర్స్‌’ సినిమాలో ఆరాధ్య అనే పాత్ర చేశా. ఇందులో వాతావరణం కోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని ప్రచారం చేస్తా. ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, విలువలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. బాధ్యత లేని యువకుడి పాత్రలో సంజోష్‌ కనిపిస్తారు.

రాజేంద్రప్రసాద్‌గారి లాంటి గొప్ప నటులతో నటించడం నిజంగా అమేజింగ్‌. మంచి ఎక్స్‌పీరియన్స్‌. ఈ సినిమాకు ఆయన ఒక పిల్లర్‌గా నిలబడ్డారు. టీమ్‌ని ప్రోత్సహించారు. దర్శకుడు రమేష్‌ బాగా తీశారు. నిర్మాతలు కుటుంబ సభ్యురాలిగా నన్ను ట్రీట్‌ చేశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రవితేజగారు, పవన్‌ కల్యాణ్‌గారు నా అభిమాన హీరోలు. వాళ్లతో కలిసి పనిచేయాలని ఉంది. తెలుగులో నా నెక్ట్స్‌ కమిట్‌మెంట్స్‌ ప్రస్తుతానికి లేవు. తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు