నమ్మకాన్ని నిలబెడతా

9 Dec, 2013 23:18 IST|Sakshi
నమ్మకాన్ని నిలబెడతా
నిర్మాత విపుల్ షా సినిమాలో మళ్లీ అవకాశం లభించడం సంతోషంగా ఉందని బాలీవుడ్ నటి పూజా చోప్రా తెలిపింది. ‘రూప్ నగర్ కీ ఛీతే’ సినిమాలో నటించడం ఓ వైపు ఆనందాన్ని కలిగి స్తున్నా, అదే సమయంలో  తనను తాను నిరూపించుకునేందుకు ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించింది. గతంలో విపుల్ షా నిర్మించిన కమాండోలో నటించిన పూజా చోప్రా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈ మాటలు మాట్లాడింది. ‘అవును. ఎంతో ఉద్వేగంతో ఉన్నా. విపుల్ షా లాంటి నిర్మాతలు తనకు మరో చాన్స్ ఇచ్చి ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఈ సినిమాలో నటించాలంటే ఎంతో ఒత్తిడిగా ఉంది. 
 
 అయితే దీనివల్ల వచ్చే ఫలితంతో అమితమైన ఆనందం కలుగుతుంది. షా నాకు రెండో అవకాశమిచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నటిస్తాన’ని పూజా చోప్రా సోమవారం మీడియాకు తెలిపింది. కమాండో సినిమాలో ఓ చిన్న పట్టణ యువతి సిమ్రిత్ కౌర్ పాత్రను పోషించిన తాను ఈ సినిమాలో విభిన్న పాత్రలో నటిస్తున్నానని వివరించింది. ‘వచ్చే ఏడాది జనవరి నాలుగు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. కమాండో సినిమాకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. స్నేహం గురించే ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యూత్‌ఫుల్ స్టోరీ’ అని ఆమె పేర్కొంది.  ఈ సినిమాలో ఢిల్లీలోని ఓ మోడ్రన్ గర్ల్ పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ఇందుకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది. షా నిర్మిస్తున్న రూప్ నగర్ కీ ఛీతే సినిమాకి విహాన్ సూర్యవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.