'ఆయన' ఓ మర్చిపోలేని అనుభూతి!

4 Jul, 2015 01:26 IST|Sakshi
'ఆయన 'ఓ మర్చిపోలేని అనుభూతి!

 ‘నీ జతగా నేనుండాలి’ (ఎవడు), ‘చలి చలిగా గిల్లింది’(మిస్టర్ పర్‌ఫెక్ట్), ‘నువ్వేం మాయ చేశావోగానీ’ (ఒక్కడు) ఈ పాటలు వింటే ఠక్కున గుర్తొచ్చే గాయని శ్రేయా ఘోషాల్. పుట్టింది, పెరిగింది ఉత్తరాదిలో అయినా, నిజంగా తెలుగమ్మాయే పాడుతోందేమో అనిపిస్తుందామె గొంతు వింటే. అయిదు నెలల క్రితమే శ్రేయా ఘోషాల్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వైవాహిక జీవితం గురించి ఆమె మాట్లాడుతూ -‘‘పెళ్లి వల్ల నా జీవితం ఏ మాత్రం మారలేదు. చాలా సంతోషంగా ఉన్నాను.

పైగా మా ఇద్దరి అభిరుచులూ, అభిప్రాయాలూ ఒకటే. దీనికి మించిన సంతోషం ఇంకెక్కడా ఉండదేమో’’ అని చెప్పారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో పాటలు పాడిన శ్రేయ దక్షిణాదిలో తన వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెబుతూ, ‘‘సౌత్‌లో చాలా మంది సంగీత దర్శకులతో పనిచేశాను. కానీ ‘మేస్ట్రో’ ఇళయరాజా లాంటి మహానుభావుడి సారథ్యంలో పాడే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన  దగ్గర పాట పాడుతున్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటా’’ అన్నారు.