సినీ కార్మికులకు ఆరోగ్యభీమా కల్పిస్తాం

7 Feb, 2019 05:20 IST|Sakshi
కాదంబరి కిరణ్, దశరథ్, పి. రామ్మోహన్‌ రావు

–ఎఫ్‌డీసీ చైర్మన్‌ పి. రామ్మోహన్‌రావు

‘‘నిత్యం పోటీ ఉండే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. కాదంబరి కిరణ్‌తో పాటు ‘మనంసైతం’ బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదని తెలిసింది. అలాంటి శాఖల సినీ కార్మికులకు ఎఫ్‌డీసీ నుంచి సగం ఖర్చు తగ్గిస్తూ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తాం’’ అని ఎఫ్‌డీసీ చైర్మన్‌ పి. రామ్మోహన్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మనం సైతం’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రామ్మోహన్‌ రావు పదిమంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘చిత్రపురి కాలనీలో ఓ వైద్యశాల నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ‘మనం సైతం’ కార్యక్రమానికి నేను ఎప్పుడు అందు బాటులోనే ఉంటాను’’ అన్నారు. ‘‘మానవత్వం ఇంకా మిగిలే ఉందని మనం సైతం కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం’’ అని మాజీ మంత్రి లక్షా్మరెడ్డి సతీమణి  శ్వేతా లక్షా్మరెడ్డి అన్నారు. ‘‘నేను ఎదుర్కొన్న బాధలు, కోపం, కసి, ప్రతీకారం, ఆవేదనల నుంచి మొదలైనదే ఈ మనం సైతం కార్యక్రమం. ఏడుగురు సభ్యులతో మొదలైన మా బృందంలో ఇప్పుడు దాదాపు లక్షా డెబ్భై వేలమంది ఉన్నారు’’ అన్నారు కాదంబరి కిరణ్‌. దర్శకుడు దశరథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు