చూడగానే నా గుండె పగిలింది : నటి

18 Oct, 2017 19:54 IST|Sakshi

సాక్షి, ముంబయి : ఆర్టిస్ట్‌ కరణ్‌పై దాడి జరగడాన్ని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె జీర్ణించుకోలేపోతున్నారు. కరణ్‌ను అడ్డుకుని, ఆయనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కోరారు. ఈ మేరకు ట్వీట్‌ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు దీపిక. అసలు వివాదం ఏంటంటే..  సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి మూవీలో దీపికా పదుకొనె ప్రధాన పాత్ర పోషించారు. అయితే మూవీ షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచీ ఏదో ఓ వివాదం ‘పద్మావతి’ని యూనిట్‌ను చుట్టుముడుతోంది.

ఓ సందర్భంలోనైతే ఏకంగా చిత్ర యూనిట్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దాంతో షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది. తాజాగా ఈ మూవీలో పద్మావతిగా కనిపించే దీపికా పదుకొనె లుక్‌ను ఆర్టిస్ట్‌ కరణ్‌ కొన్ని రంగులతో చిత్రీకరిస్తుండగా కొందరు దుండగులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ‘ఆ దాడి దృశ్యాలు చూడగానే నా గుండె పగిలింది. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి సమస్యలు, ఆగడాలను భరించాలి. దీనికి బాధ్యులు ఎవరు?. వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించడమే ఆ దాడి ఉద్దేశం. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని స్మృతీ ఇరానీకి విజ్ఞప్తి చేస్తూ’ నటి దీపికా వరుస ట్వీట్లు చేశారు.  పలు వివాదాల నడుమ ఈ చారిత్రక దృశ్య కావ్యం డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

>
మరిన్ని వార్తలు