హీరో అజిత్‌కు ఏమైంది? 

24 May, 2020 09:23 IST|Sakshi

గత రెండు రోజులుగా కోలీవుడ్‌లో హీరో అజిత్‌ గురించి చర్చ కొనసాగుతోంది. ఆయనకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 22న అజిత్‌ తన భార్య షాలినితో కలిసి ముఖాలకు మాస్క్‌లు ధరించి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో అజిత్‌కు ఏమైందన్న ప్రశ్న సర్వత్ర నెలకొంది. ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముఖానికి మాస్క్‌లతో అజిత్‌ ఆస్పత్రికి వెళ్లడం ఆయన వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. (బాలీవుడ్ను వదలని కరోనా..)

దీని గురించి పలు రకాల ప్రచారం జరుగుతోంది. అజిత్‌ తండ్రి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని.. ఆయన్ను పరామర్శించడానికే అజిత్, షాలిని దంపతులు వెళ్లారని ఒక ప్రచారం జరుగుతోంది. కాగా అజిత్‌కు ఆ మధ్య శస్త్ర చికిత్స జరిగిందని, దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళుతుంటారని, అందులో భాగంగా అజిత్, తన భార్యతో కలిసి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయమై అజిత్‌ వర్గం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా అజిత్‌ ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ నిలిచిపోవడంతో అజిత్‌ ఇంట్లోనే ఉంటున్నారు. (నాలుగు జతల బట్టలతో ఉంటున్నా: నటి)

మరిన్ని వార్తలు