చిన్నారికి అఖిల్ పరామర్శ

9 Feb, 2016 15:49 IST|Sakshi
చిన్నారికి అఖిల్ పరామర్శ

ఖమ్మం: టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించారు. ఖమ్మంకు చెందిన ఆరేళ్ల అశ్విత్ రెడ్డి గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కుమారుడు ఆరోగ్యం మెరుగుపడడం కోసం అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో అశ్విత్ రెడ్డి హీరో అఖిల్ను కలవాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మంలో చిన్నారిని పరామర్శించారు. కొద్దిసేపు అతనితో కలసి మాట్లాడి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నాడు.

అంతకు ముందు అఖిల్ ఖమ్మం నగరంలో సందడి చేశాడు. సరదాగా ఆటో నడిపాడు. ప్రయాణికులు ఇచ్చిన నగదును అఖిల్ అశ్విత్ రెడ్డి కుటుంబానికి అందజేశాడు. దీంతో చిన్నారితో పాటు అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అశ్విత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని అఖిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలకృష్ణలు అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులను స్వయంగా పరామర్శించిన విషయం తెలిసిందే.